చేర్యాల, జనవరి 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) ఆదివారం భక్త జనులతో(Devotees) కిటకిటలాడింది. శనివారం సాయంత్రం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ప్రైవేటు, ఆలయ నిర్వహణలో ఉన్న దాతల గదులను అద్దెకు తీసుకుని రాత్రికి బస చేశారు. అనంతరం ఆదివారం వేకువ జామునే నిద్రలేచి కోనేటిలో పవిత్రంగా స్నానాలు ఆచరించారు. స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు తదితర మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు.
మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తయారు చేసి కొండ పైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బొనాలు సమర్పించారు. మరి కొందరు రాతి గీరల వద్ద ప్రదక్షణలు, కొడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి తమ కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రామాంజనేయులు, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.