హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు విదేశాల్లో ఉన్నారంటూ వ్యాఖ్యానించిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్పై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవడం తప్ప తెలంగాణ ఉద్యమంపై ఆయనకు కనీస అవగాహన లేదని ఎద్దేవా చేస్తున్నారు.
ఉద్యమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత వంటివారు కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. మంత్రి హరీశ్ 2001 నుంచి సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, మంత్రి కేటీఆర్ అమెరికాలో ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమంలో భాగస్వామి అయ్యారని వెల్లడించారు. వీరిద్దరూ లాఠీ దెబ్బలు తిన్నారని, పోలీస్ కేసులు, రాజకీయంగా వేధింపులు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదని తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంప్రదాయం ఎదుర్కొన్న వివక్షపై ప్రజలకు అవగాహన కల్పించి, ఉద్యమంలో కీలకపాత్ర పోషించేలా చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించారు కాబట్టే స్వరాష్ట్రంలో వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొన్నారని, పదవులు కట్టబెట్టారని అన్నారు. ఇవేవీ తెలుసుకోకుండా మాట్లాడటం తరుణ్చుగ్ అవగాహనలేమికి నిదర్శనమని ధ్వజమెత్తారు.