మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి)/చేగుంట, ఏప్రిల్ 14 : పంటలు చేతికి రాక.. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై.. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో ఇద్దరు రైతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం మోతె గ్రామానికి చెందిన మోటి మల్లయ్య (48) వ్యవసాయంతోపాటు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
మల్లయ్య తనకున్న ఎకరం 20 గుంటల భూమిలో వరి సాగుచేశాడు. పంటకు సాగు నీరు అందించి కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పులు చేసి వ్యవసాయ భూమిలో ఇటీవల రెండు బోర్లు వేశాడు. రెండు బోరు బావుల్లో చుక్క నీరు పడలేదు. గతంలో ఉన్న రూ.8 లక్షల అప్పుకు తోడు ఇటీవల వేసిన రెండు బోరు బావుల కారణంగా అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో మల్లయ్య మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతున్న ఆయన ఆదివారం తన ఇంటి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య కళవ్వ, కుమారుడు మహేశ్ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామానికి చెందిన పల్లపు బాలయ్య (37) పదేండ్ల క్రితం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రెడ్డిపల్లి కాలనీకి చెందిన ఉప్పు మమతతో వివాహమైంది. అప్పటి నుంచి రెడ్డిపల్లి కాలనీలోనే నివాసం ఉంటున్నారు. జబ్బాపూర్లో బాలయ్య తండ్రి పేరు మీద ఎకరం పట్టా, ఎకరన్నరం లావణి పట్టా భూమి ఉన్నది. బాలయ్య తండ్రికి ముగ్గ్గురు కొడుకులు కాగా అన్నదమ్ములు ఇటీవలే పంచుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు.
బాలయ్య రెడ్డిపల్లి కాలనీలో కూడా కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఓ ట్రాక్టర్ కొనుగోలు చేసి నడుపుకొంటున్నాడు. వ్యవసాయానికి, ట్రాక్టర్కు చేసిన అప్పులు ఎక్కువ కావడంతో, కొంత కాలంగా మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆయన కాలనీ సమీపంలోని ఓ చెట్ట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్యకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చేగుంట ఎస్సై బాల్రాజ్ తెలిపారు.