హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం సర్వే దాదాపు పూర్తయింది. స్థానికంగా పర్యటించిన ఏఈవోలు రైతులవారీగా పంట నష్టం వివరాలను నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన తుది జాబితాను నేడో, రేపో వ్యవసాయ శాఖ విడుదల చేయనున్నది.
కౌలు రైతుల వివరాలను కూడా ఇదే జాబితాలో వెల్లడించనున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేయనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో ధైర్యం నింపారు. అప్పటికప్పుడే ఎకరాకు రూ.10 వేలు ప్రకటించిన సీఎం.. ఆ వెంటనే రూ.228 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల తుది జాబితా రూపొందించిన వెంటనే రైతుల ఖాతాల్లో పరిహారం నిధులను జమ చేయనున్నారు.