సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటల(Crop Damage) వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో పంట నష్టం,ధాన్యం(Paddy Purchase) కొనుగోళ్లపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా(Review) నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాసంగి సీజన్ లో జిల్లా నుంచి కొనుగోళ్ల లక్ష్యం ఏడు లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 20 వేల బస్తాలు మాత్రమే సేకరించడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. 213 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇంత తక్కువ సేకరించడం పట్ల అధికారులను నిలదీశారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేదిలేదని అన్నారు. ప్రకృతి ప్రకోపంతో ధాన్యం సేకరణకు ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను కొంటామని భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లను అదనపు అధికారులతో పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.ధాన్యం కొనుగొళ్లపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ఎన్ని వేషాలు వేసినా రైతులు కేసీఆర్ గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు దేశంలో ఎక్కడాలేవని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావు తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.