హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట కమిటీ రాజకీయంగా మంటలు రేపుతుండగా ఆధ్యాత్మికంగా ఈ కమిటీలో మెజార్టీ సభ్యుల్లో ఎంతమంది ఈ దేవాలయంతో సంబంధాలు కలిగి ఉన్నారనే చర్చ మొదలైంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి సాధారణ రోజుల్లో రోజుకు ముప్పై నుంచి నలభైవేల మంది భక్తులు వస్తుండగా సెలవులు, పండుగ రోజుల్లో ఆ సంఖ్య లక్షకు చేరుతున్నది. కేవలం భక్తులు ఇచ్చే హుండీ కానుకలతోనే దేవాలయ నిర్వహణ సాధ్యమవుతుందని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. భక్తుల భాగస్వామ్యంతో యాదాద్రికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాభవాన్ని తెచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలోనే యాదాద్రికి సంబంధించిన పనులు 90 శాతం పూర్తిఅయ్యాయి.
అయితే గత రెండున్నరేండ్లుగా యాదాద్రికి సంబంధించి ఎలాంటి పనులు జరుగలేదు. కేసీఆర్ హయాంలో పూర్తిచేసిన బంగారు విమానగోపురాన్ని రేవంత్రెడ్డి అట్టహాసంగా ప్రారంభించడం తప్పితే కొత్తగా చేపట్టిన నిర్మాణాలేవీ దాదాపుగా లేవు. యాదగిరిగుట్టను మరింత విస్తరించడంతో పాటు, సత్రాలు, మఠాలు, కులసంఘాలకు భూ కేటాయింపులు ఇతరత్రా అంశాలపై తాజాగా ముఖ్యమంత్రి దృష్టిపెట్టారు. తిరుమల తరహాలో ఇక్కడా సత్రాలు నిర్మించాలంటూ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చిన రోజే దేవాదాయమంత్రి కొండాసురేఖ లేకుండానే, దేవాదాయ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, యాదగిరిగుట్ట ఆలయ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమయంలోనే యాదగిరిగుట్టకు 11 మంది సభ్యులు, ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యులను కలిపి 18మందితో టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో దాదాపుగా అందరూ వ్యాపారవేత్తలే కాగా వారిలో దేవాలయ వ్యవస్థతో పెద్దగా సంబంధమున్నవారు తక్కువే. అందులోనూ అసలు యాదాద్రికి ఎప్పుడూ రానివారు కూడా ఉన్నారు. దేవాలయ అభివృద్ధి అంటే ఆధ్యాత్మికంగా కాకుండా కేవలం వ్యాపారాత్మకంగానే భావించిన ప్రభుత్వం ఈ కమిటీని నియమించడంలో వ్యాపారస్తుల కోణాన్నే చూసిందనే చర్చ జరుగుతున్నది.
యాదగిరిగుట్ట నరసింహస్వామే బ్రాండ్ కాగా.. గుట్ట తెలంగాణ ఆలయాలకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు కమిటీలో మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ ఉండడంతో కొత్తతరహా ప్రచారానికి కొందరు కాంగ్రెస్ నేతలు తెరతీశారు. మెగాబ్రాండ్తో యాదగిరిగుట్ట బ్రాండ్ పెరుగుతుందనే రేవంత్రెడ్డి ఈ ప్రయత్నం చేశారం టూ చేస్తున్న వ్యాఖ్యలు స్థానికంగా దుమారం రేపుతున్నాయి. అంతేకాకుండా మెగాస్టార్ కు టుంబం నుంచి ఆయన, ఆయన కూతురు మాత్రమే వేర్వేరు సందర్భాల్లో యాదగిరిగుట్ట లో స్వామివారి దర్శనం చేసుకొన్నారని, ఇప్పటివరకు కొణిదెల సురేఖ స్వామి దర్శనమే చేసుకోలేదంటూ ఆలయ వర్గాలు చెప్తున్నా యి. మరికొందరు బోర్డుమెంబర్ల విషయంలో నూ దేవస్థాన సిబ్బంది చర్చించుకొంటున్నారు.
వీరెవరూ దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములు కారు సరికదా.. ఎప్పుడూ ఆలయానికి విరాళాలు కూడా ఇవ్వలేదని, చైర్మన్ సత్యనారాయణరెడ్డి గుట్టలో నిర్మించిన విల్లాస్ విషయంలో కేసీఆర్ అడిగిన వెంటనే ఒప్పుకొని అప్పుడే ముందుకు వచ్చి కట్టించారని అంటున్నారు. మిగతావారిలో ఇద్దరుముగ్గురు మినహాయిస్తే గుట్టకు విరాళాలిచ్చిన వారెవ రూ లేరని అంటున్నారు. సభ్యుల్లో చాలామందికి వ్యాపారాలుండగా వారికి ఆలయంపై దృష్టి పెట్టే అవకాశం ఎక్కడ ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయవ్యవస్థను వ్యా పారమయం చేయడానికే స్థానిక సమస్యలు తెలియనివారిని, దేవస్థాన కమిటీ సభ్యుల పోస్టులకు తిరుమల బోర్డు మెంబర్ల తరహాలో డిమాండ్ పెంచే ప్రయత్నంలో భాగమే ఇటువంటి కమిటీ అంటూ స్థానికంగా వివిధ వర్గా ల ప్రజలు విమర్శిస్తున్నారు.
ఆధ్యాత్మికతకు నిలయమైన తొగుట ప్రాంతంలోని గురుమదనానంద పీఠాధిపతి మాధవానందస్వామి మొ దలుకొని స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలతో పాటు ఆలయాల అభివృద్ధిలో పాలుపంచుకొనే దాతలు చాలామంది ఉన్నారు. వారందరినీ కాదని, తనకు నచ్చిన, మెచ్చిన వ్యక్తులను దేవస్థాన కమిటీలో నియమించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కమిటీలో శాస్త్రం తెలిసినవారు, పండితులు ఏ ఒక్కరైనా ఉన్నా రా అంటూ తెలంగాణ ఆధ్యాత్మికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వైష్ణవాలయమైన యా దగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీలో ఒక్క స్థానాచార్య తప్ప వైష్ణవులెవరికీ చోటు లేకుండాపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల యాదాద్రి వేదపాఠశాల తరహాలోనే ఆలయంపై ఇతరుల ఆధిపత్యం పెరుగుతుందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట కొలువుదీరిన ఉమ్మడి నల్లగొండ జిల్లా వారికీ ఈ కమిటీలో చోటు లేకుండాపోవడంతో స్థానికులంతా మండిపడుతున్నారు.