హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకొనే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులను పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ ఆదేశించారు. కొనుగోలు చేసిన వారిపై కూడా కేసులు పెట్టాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే మిల్లులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో తనిఖీలను విస్తృతం చేయాలని విజిలెన్స్ బృందాన్ని ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్ల సమాచారం అందించినవారికి తగిన పారితోషికం ఇవ్వడంతోపాటు వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పౌరసరఫరాలభవన్లో సోమవారం విజిలెన్స్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ప్రధాన అంశాలను అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్కు చెందిన మిల్లుకు 2021-22లో రెండు సీజన్లకు 11,427 టన్నుల ధాన్యం కేటాయించగా, ఇందులో 9,523 టన్నుల ధాన్యాన్ని మిల్లు యజమాని అమ్ముకున్నారని తెలిపారు. ఆ ధాన్యం విలువ రూ.18 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సీఎంఆర్ ఇచ్చారని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల స్టేజ్-1 గోదాం నుంచి పౌరసరఫరాల సంస్థ ఎంఎల్ఎస్ పాయింట్కు గత సోమవారం ఐదు లారీల్లో బియ్యంలోడ్ పంపించగా ఇందులో 420 బస్తాల చొప్పున ఉన్న మూడు లారీలే గోదాంకు చేరాయని, మరో 2 లారీలను ఓ రైస్ మిల్లులో అన్లోడ్ చేశారని తెలిపారు. ఈ ఘటనపై మరింత విచారణ జరపాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడకుండా ఆయా జిల్లాల పరిధిలోని అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.