హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): డెకాయ్ ఆపరేషన్తో నగరంలో కొనసాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు మరో కన్సల్టెన్సీపై అనుమానంతో డెకాయ్ ఆపరేషన్ చేయించగా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న దందా బట్టబయలైంది.
వివరాల్లోకి వెళితే.. హనుమకొండకు చెందిన నర్రిశెట్టి సురేందర్, సాయి నగరంలోని కేపీహెచ్బీలో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. సురేందర్కు ఆన్లైన్లో ఢిల్లీకి చెందిన అమన్ పరిచయమై.. లక్ష రూపాయలు ఇస్తే ఎలాంటి సర్టిఫికెట్ అయినా ఇస్తానని చెప్పాడు. దీంతో సురేందర్, సాయి ఈ అక్రమ దందాకు తెరతీయడంతో గిరాకీ పెరిగింది.
దీనిని గమనించిన మరో కన్సల్టెన్సీ నిర్వాహకుడు అనుమానంతో డెకాయ్ ఆపరేషన్కు ప్లాన్ చేశాడు. కేపీహెచ్బీ ప్రాంతానికి చెందిన బ్రహ్మారెడ్డిని పంపించగా.. లక్ష రూపాయలు తీసుకొని శివాజీ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ను శివాజీ యూనివర్సిటీలో తనిఖీ చేయించగా నకిలీగా తేలింది.
దీంతో బ్రహ్మారెడ్డి సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ఈ నెల 14న సురేందర్, సాయిని అరెస్టు చేశారు. ఢిల్లీ ముఠా కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఈ ముఠా వెనుక పెద్ద తలకాయల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.