దరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర్రాజా బ్యాటరీఎస్ కంపెనీ ఏర్పాటు ఘనత గత బీఆర్ఎస్ సర్కారుదేనని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. నాడు వ్యతిరేకిస్తూ బండ బూతులు తిట్టిన రేవంత్రెడ్డి ఇప్పుడు పరోక్షంగా ఒప్పుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో కేటీఆర్ నేతృత్వంలో మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని చెప్పారు. ఐటీ హబ్కు భూములు సేకరించిన విషయాన్ని గుర్తుచేశారు. అమర్రాజా చన్నైకి తరలివెళ్తుందని తెలిసిన వెంటనే కేటీఆర్ కంపెనీ బాధ్యులను ఒప్పించి మహబూబ్నగర్కు తీసుకువచ్చారని స్పష్టంచేశారు.
నాడు తిట్టిన నోళ్లే పొగుడుతున్నయ్..
బీఆర్ఎస్ పాలనలో అమర్రాజ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దుర్భాషలాడిన నోర్లే ఇప్పుడు పొగుడుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుత మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అమర్రాజతో కాలుష్యం తప్ప.. ఒరిగేదేమీ ఉండదని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన విషయాన్ని ప్రస్తావించారు. నాడు బండ బూతులు తిట్టిన రేవంత్రెడ్డి ఇప్పుడు చైనా కంపెనీలతో పోల్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ దూరదృష్టితో చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు ముఖ్యమంత్రికి అర్థమయ్యాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో బిగించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మోటర్లను ఆన్చేయడం, ఇప్పుడు అమర్రాజా బ్యాటరీస్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని పునరుద్ఘాటించారు.
కాలువలు తవ్వి పాలమూరును పూర్తిచేయండి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
బీఆర్ఎస్ ఒత్తిడికి దిగొచ్చి మొన్న పాలమూరు పంపులు, నేడు అమర్రాజా ప్లాంట్ను అందుబాటులోకి తీసుకువచ్చారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పంప్లు ఆన్చేసిన మాదిరిగానే కాలువలు తవ్వి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి రైతాంగానికి నీరందించాలని డిమాండ్ చేశారు. నార్లాపూర్ పంపులు ఆన్చేసిన మాదిరిగానే కన్నెపల్లి పంప్లు ఆన్చేసి నీరందించాలని విజ్ఞప్తిచేశారు. కన్నెపల్లి పంపుల ప్రారంభం, గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.