సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ) : పారదర్శకతతో పాటు వ్యాపార కార్యకలాపాల సౌలభ్యం, నిర్మాణాత్మక, విధాన సంస్కరణలతో హైదరాబాద్ రియల్ రంగం సమగ్ర మార్పులతో ముందుకు వెళుతున్నది..అంచెలంచెలుగా పెరుగుతున్న హైదరాబాద్ విస్తీర్ణం, జనాభాకు తగ్గట్టుగా ప్రణాళికబద్ధమైన మౌలిక వసతుల కల్పన జరుగుతున్నది. తెలంగాణ ఏర్పాటు కాక ముందే హైదరాబాద్ లో 10-15 అంతస్తుల భవనాలే గొప్పగా కనిపించేవి. అంత కంటే ఎకువ ఫ్లోర్లు ఇకడి బిల్డర్లు నిర్మిస్తారని కూడా అనుకోలేదు.
కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలనలో అనూహ్య మార్పులు వచ్చాయి. దేశంలోనే అత్యధిక ఎతె్తైన భవనాలను కలిగిన నగరంగా ఎదిగింది. స్ర్కైస్క్రాపర్స్ నిర్మించే స్థాయికి చేరింది. 65 అంతస్తుల భవనం కలిగిన రెండో నగరంగా, ఎకరం భూమిని రూ. వంద కోట్లకు అమ్మే స్థాయికి హైదరాబాద్ రియాల్టి రంగం ఎదిగిందంటే ఇక్కడి రియల్ మార్కెట్కున్న ఘనత అని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో ఎవరూ పెట్టుబడి పెట్టిన ప్రతిఫలం బాగుంటుంది అనేది నిరూపితమైన సత్యం..పైగా హైదరాబాద్ నగరంలో జరిగే అభివృద్ధి కంటికి కనిపిస్తోంది.
మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దీనికి తోడు ఇప్పటికే హైదరాబాద్ నగరం అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎన్నోసార్లు గుర్తింపు సాధించింది. అదనపు హంగులు కాంగ్రెస్ ప్రభుత్వంలో తోడైతే నగరాభివృద్ధిలో కొత్త శకం మొదలవుతుంది. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లను కేటాయించడం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, నగరానికి అదనపు జలాల సేకరణ, మెట్రో విస్తరణ ఇలా కీలక ప్రాజెక్టులపై సర్కారు ఫోకస్ చేయడంతో రియల్ రంగంలో జోష్ కనబడుతున్నది.
హైదరాబాద్ వెస్ట్జోన్లో ఔటర్ రింగు రోడ్డు వరకు రియల్ డవలప్ అయింది. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగు రోడ్డు వరకు రోడ్డు కం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుతో సౌత్ కారిడార్లో రియల్ అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతేకాదు జీనోమ్ వ్యాలీలో ఫేజ్-2కు ప్రణాళికలు చేస్తుండటంతో కంపెనీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ మార్కెట్లో తెలుగు వాళ్లు మాత్రమే కాదు..ఇతర రాష్ర్టాల వాళ్లు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలో బెంగుళూరు తర్వాత కాస్మొపాలిటన్ సిటీగా ఉన్నది హైదరాబాద్ మాత్రమే.
ఎన్ఐఆర్లే బలం.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్ఆర్ఐలే బలం. ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లను ఇండి యా మొత్తంలో ఎక్కువగా ఆకర్షిస్తున్నది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్టే. ఎన్ఆర్ఐలను ఆకర్షించడం కోసమే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో క్రెడాయ్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ( 9, 10, 11వ తేదీలో)్ల కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నది. ఈ ప్రాపర్టీ షోలో నగరవ్యాప్తంగా ఉన్నటువంటి డెవలపర్లు, బిల్డింగ్ మెటీరియల్ మాన్యుఫాక్చరర్స్, కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఇలా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ప్రదర్శన చేపడుతున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి వివరించారు.
సుదీర్ఘ కాలంగా హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం దశల వారీగా ఎదుగుతూ వచ్చింది. గడిచిన 9 నెలల కాలంగా రాష్ట్రంలో మారిన మార్పుల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కొంత సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొంది.గతేడాది రెసిడెన్షియల్ సెగ్మెంట్లో జరిగిన క్రయవిక్రయాల కంటే మెరుగ్గానే ఉన్నాయి. క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు మంచి స్పందన వచ్చింది. సుమారు 50వేలకు పైగా ప్రజలు సందర్శించారు.
– రాజశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ హైదరాబాద్