హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉకుపాదం మోపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి ఆందో ళన వ్యక్తం చేశారని, ప్రమాదాల నివారణకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. నగరంలో వాహనదారులకు, సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ పోలీసులు విధులను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయనున్నదని, దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతున్నదని వెల్లడించారు. ఈ బ్యూరో అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ చందన దీప్తితో, ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, కాజల్ సింగ్, రాహుల్ రెడ్డి, అవినాష్ కుమార్, శేషాద్రిని రెడ్డి, శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.