హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా హెచ్చరించారు. పుప్పాలగూడలో మంగళవారం చేప పిల్లల పంపిణీని పరిశీలించిన కమిషనర్.. 3.50 లక్షల చేప పిల్లలను తిరస్కరించారు. నిబంధనల ప్రకారం చిన్న చేప పిల్లలు 35-40 ఎంఎం, పెద్ద చేప పిల్లలు 80-100 ఎంఎం ఉండాలి. కానీ పంపిణీ దారులు మాత్రం ఇందుకు అనుగుణంగా చేప పిల్లల్ని పంపిణీ చేయడం లేదు. ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో 36.31 లక్షల చేప పిల్లలను తిరస్కరించారు. ఇక టెండర్ల దశలో నకిలీ బ్యాంక్ గ్యారంటీ సమర్పించిన ముగ్గురు పంపిణీదారుల మోసాన్ని అధికారులు గుట్టు రట్టు చేశారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు టెండర్ నుంచి తప్పించారు. ఈ సీజన్లో మొత్తం చేపపిల్లల పంపిణీని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా మత్స్యమిత్ర అనే యాప్ను రూపొందించారు. చేప పిల్లలు సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ను అమర్చారు.