పెద్దపల్లి : గుండె సమస్యలతో బాధపడేవారి ప్రాణాలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) తెలిపారు. సీపీఆర్(CPR) నిర్వహణపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. పెద్దపల్లి కలెక్టరేట్లో శనివారం సీపీఆర్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో గుండెపోటు (Heart problem)తో యువకులు కూడా మరణించడం విషాదకరమని పేర్కొన్నారు. ఆకస్మిక గుండెపోటు సమయంలో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు సంరక్షించే అవకాశాలు 50 శాతం మెరుగవుతాయని వెల్లడించారు. మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) నాయకత్వంలో వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా టీ డయాగ్నస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు పెరగడంతో ప్రసవాల సంఖ్య దాదాపు 70 శాతం చేరుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కంటి వెలుగు దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్ పర్సన్ రేణుక, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ , జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.