హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. బీజేపీని ఓడించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ మద్దతు కోరుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తులపై రాష్ట్ర కమిటీలో చర్చించడంతోపాటు పొలిట్బ్యూరోతో సంప్రదింపులు కొనసాగించిన తరువాతే తుది నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన రాజీనామాపై సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గానికి అన్యాయం జరిగితే కాంగ్రెస్కు ఎందుకు రాజీనామా చేశారని నిలదీశారు. రాజగోపాల్రెడ్డిని గెలిపిస్తే.. నెలలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా మునుగోడు సభలో ప్రకటించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలను కొనడం, ఈడీ, సీబీఐని ప్రయోగించడం లాంటి చర్యలకు అనేక రాష్ర్టాల్లో బీజేపీ పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ, అమిత్షా, బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా రాజకీయాలను ఒక వక్రమార్గం పట్టిస్తున్నారని మండిపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నిక వెనుక బీజేపీకి పెద్ద వ్యూహమే ఉన్నదని తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న పరిస్థితిని టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ను మూడో స్థానంలోకి నెట్టడం ద్వారా, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ఎత్తుగడ వేసిందని పేర్కొన్నారు. బీజేపీతో తెలంగాణకు పెద్ద ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అనేక రాజకీయ పార్టీలు ఆ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ గెలిస్తే రాజకీయ పార్టీల మనుగడే ప్రమాదంలో పడుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ను శుక్రవారం స్నేహపూర్వకంగా కలిసి, సమస్యలు పరిష్కరించాలని కోరుతామని వెల్లడించారు.