హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులపాటు కొనసాగిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో అభివృద్ధి అంశాల ప్రస్తావన కంటే ఎన్నికల ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఇది కేవలం ఎన్నికల సభ కాదంటూనే.. 400 సీట్లు, బీజేపీకే అందరి మద్దతు.. అంటూ ప్రసంగం చేశారని ఎద్దేవా చేశారు. పైగా రామమందిరానికి బంగారు తలుపులు, ధ్వజస్తంభం తెలంగాణ నుంచే వచ్చాయని, రాముడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలకు ఉంటుందని చెప్పిన ప్రధాని పర్యటనతో రాష్ర్టానికి, జిల్లాలకు ఒరిగిందేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు.