ఖమ్మం, జనవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలో మతతత్వ బీజేపీని గద్దె దించేందుకే తాము కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగసభలో తమ్మినేని మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతానికి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. దేశంలో అన్నదమ్ముల్లా ఉండే వారిని బీజేపీ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అక్కడ అల్లర్లు సృష్టించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే బీజేపీకి ఎజెండాగా మారిందని ఆరోపించారు.
సమాజం బాగుపడాలంటే బీజేపీ ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండొద్దని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టుల వల్ల ఏమీ కాదని బీజేపీ తమను రెచ్చగొట్టిందని, కానీ తమ సత్తా చూపించామని స్పష్టం చేశారు. అందుకే కమ్యూనిస్టులుగా బీఆర్ఎస్ పార్టీకి తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ సభ నిర్వహించడం హర్షణీయమని కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రధాన సమస్యలను ఆయన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. భద్రాచలం ప్రతీసారి వరద ముంపునకు గురవుతుందని, అక్కడ కరకట్ట నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రధానంగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వాలని, ఖమ్మంలో జాతీయ రహదారిని విస్తరించాలని, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, దుమ్ముగూడెం ప్రాజెక్టును పూర్తి చేయాలని, భద్రాచలాన్ని ఒకే పంచాయతీగా ఉంచాలని తమ్మినేని సీఎం కేసీఆర్ను కోరారు. ఎంతో మంది కమ్యూనిస్టు నేతలకు ఖమ్మం జిల్లా ప్రాణం పోసిందని గుర్తు చేశారు. నేడు ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినా బీజేపీకి ఇక్కడ స్థానం ఉండబోదని స్పష్టం చేశారు.