నీలగిరి, ఫిబ్రవరి 17 : నరేంద్రమోదీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీపీఎం ప్లీనరీలో పాల్గొన్నారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీల విధానాలను అర్థం చేసుకోవడంలో మోదీ, లౌకిక శక్తులను కూడగట్టడంలో కాంగ్రెస్ విఫలమైనట్టు చెప్పారు.
రాష్ట్రంలో బీజేపీ విష బీజాలు నాటుతున్నదని, ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. ప్రజల్లో అనైక్యతను సృష్టించి ఓట్ల రూపంలో మలుచుకోవడానికి చూస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో ఎన్ని కుయుక్తులు పన్నినా బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మార్చిలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.