హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీజేపీ మతోన్మాద భావజాలాన్ని ప్రతిఘటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. వామపక్ష పార్టీలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని ఎంబీభవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పినట్టు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ఎన్నిక రాలేదని అన్నారు. రాజగోపాల్ వ్యక్తిగత స్వార్థంతోనే వచ్చిందని స్పష్టంచేశారు. కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ గడ్డ.. అభ్యుదయ భావాలకు నిలయమని పేర్కొన్నారు.
ఇకడ మతోన్మాద భావజాలాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదనీ, వాటిని ప్రతిఘటిస్తామని చెప్పారు. ఈ నెల 12న రామగుండంలో ఎరువుల పరిశ్రమను ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా మారారని విమర్శించారు. త్వరలోనే రాజ్భవన్ను ముట్టడిస్తామని వెల్లడించారు. అనంతరం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పాల్గొన్నారు.