హనుమకొండ చౌరస్తా, నవంబర్ 4: బీజేపీ పన్నిన కుట్ర మునుగోడులో విఫలం కాబోతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెప్తున్న విషయాన్ని గుర్తుచేశారు. శుక్రవారం సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు హనుమకొండలో ఆయన ప్రారంభించారు. అంతకుముందు పెద్దమ్మగడ్డ సెంటర్లో ఉన్న బీఆర్ అంబేదర్, జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం పెద్దమ్మగడ్డ ఏరియాలోని ఐకే గార్డెన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి అక్రమంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన కుట్రలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని దుయ్యబట్టారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని, అందుకే ఆ పార్టీని ఎక్కడికక్కడ ఓడించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరారు. రాష్ట్రంలో పోడుభూముల సమస్యల పరిషారం కోసం సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ కన్వీనర్ బొట్ల చక్రపాణి, జిల్లా కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి, వాంకుడోత్ వీరన్న, గొడుగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.