Communist parties | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అధికార బీఆర్ఎస్తో తమ స్నేహం కొనసాగుతుందని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. బీఆర్ఎస్తోనే కలిసి ముందుకెళ్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం శుక్రవారం ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని, ఆ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో రెండు పార్టీల రాష్ట్ర నాయకుల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని మాట్లాడుతూ.. బీఆర్ఎస్తో దోస్తీపై యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పేదల కోసం పోరాడే కమ్యూనిస్టులు అసెంబ్లీ, పార్లమెంటులో ఉండాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. సీట్ల కోసం దిగజారాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. రోజుకో పార్టీ మారేవారే తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కమ్యూనిస్టులను విమర్శించడమంటే సూర్యుడిపై ఉమ్మేయడమేనని అన్నారు. బీజేపీని నిలువరించడంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టులు ప్రధాన భూమిక పోషించారని చెప్పారు.
బీజేపీని ఓడించే శక్తి బీఆర్ఎస్కే ఉన్నది
వామపక్షాలు బీఆర్ఎస్కు దూరమయ్యాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకొంటారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవంలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. ఎన్నికల్లో పొత్తులు రాజకీయ విధానాల ప్రాతిపదికన ఉంటాయి తప్ప ఓట్లు, సీట్ల ప్రాతిపదిక కాదని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో బీజేపీని ఓడించడమే తమ రాజకీయ విధానమని, దానికి అనుగుణంగానే రాష్ట్రంలోనూ పార్టీల విధానం ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్తో తమ మైత్రి ఆ ప్రాతిపదికనే ఏర్పడిందని, ఇప్పటికీ అది కొనసాగుతున్నదని వివరించారు. ఓట్లు చీలకుండా ఉండేందుకే మునుగోడులో బీఆర్ఎస్తో స్నేహంగా ఉన్నామని చెప్పారు. మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన వచ్చిందని వెల్లడించారు. బీజేపీని ఓడించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీ టీమ్, కాంగ్రెస్కు బీ టీమ్ అంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో సీఎం కేసీఆర్ బలమైన వ్యక్తిగా తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.