హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారును గద్దె దించడమే తమ లక్ష్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, మతసామరస్యత, రాష్ర్టాల హక్కులను దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న దాడిని ఆపాలంటే ప్రజా ఉద్యమాలను బలపరచడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. సాయుధ పోరాటం సాగించిన స్ఫూర్తితో తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర మూడో మహాసభలు శనివారం మొదలయ్యాయి. దీనిలో భాగంగా ఆన్లైన్లో నిర్వహించిన బహిరంగ సభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, కొవిడ్ను నియంత్రించడంలో మోదీ చేతులెత్తేశారని విమర్శించారు. దేశ సంపదంతా లూటీ అవుతున్నదని, ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరుతో దేశ ఆత్మను సర్వనాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బడా పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చేలా మోదీ సర్కారు పనిచేస్తున్నదని, వారు దోచుకొన్న సంపదలో ఒక శాతం పార్టీ ఫండ్ రూపంలో బీజేపీకి ఇస్తున్నారని దుయ్యబట్టారు.
దారిద్య్రంలోకి 5 కోట్ల మంది
మోదీ ప్రభుత్వ విధానాలతో ఆర్థిక అసమానతలు పెరిగి దేశ జనాభాలో 5 కోట్ల మంది దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారని సీతారాం ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు నిరుద్యోగం, దారిద్య్రం పెరుగుతుంటే మరోవైపు మూడు రోజులకు ఒక్కసారి ధరలు పెంచుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ పునాదులన్నింటినీ పెకిలించేందుకు పూనుకొన్నదని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగ ఉద్యమం మనకు దారి చూపిందని తెలిపారు. ప్రజా ఉద్యమాలను బలపరచడమే మోదీ సర్కారు దాడులకు సరైన సమాధానమని స్పష్టం చేశారు. ఈ మేరకు సీపీఎం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి, కలిసివచ్చే పార్టీలతో ముందుకు సాగుతుందని సీతారాం ఏచూరి తెలిపారు.
బీజేపీ విషసర్పం: తమ్మినేని
కరోనా, ఆర్థిక సంక్షోభాలకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, రాష్ట్రంలో బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలంగాణలో బీజేపీ విష సర్పాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఎదగనివ్వబోమని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి 25వ తేదీ వరకు తుర్కయాంజాల్లో ప్రతినిధుల సభ జరుగుతుందని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టీ జ్యోతి, కేంద్ర కమిటీ సభ్యులు చెరుకుపల్లి సీతారాములు తదితరులు సభలో మాట్లాడారు.
ఉద్యమాలకు అండగా ఎర్రజెండా: బృందాకారత్
మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరమున్నదని ఉద్ఘాటించారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యంతోపాటు రాష్ర్టాల హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని, మైనారిటీలు, దళితులపై బీజేపీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు తెలంగాణకు వినాశకరంగా మారనున్నాయని పేర్కొన్నారు. సింగరేణి కోల్ మైన్స్ను ప్రైవేటీకరించేందుకు, వ్యవసాయ బోర్లపై విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తున్నదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు తమ హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసం కేంద్రంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.