హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రైతులకు ఇస్తున్న ఎరువుల సబ్సిడీని తప్పించుకొనేందుకే కేంద్రప్రభుత్వం పీఎం ప్రణామ్ పథకాన్ని తెస్తున్నదని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆహార భద్రతకు అత్యంత ప్రమాదకరమని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఏటా 1.9% జనాభా పెరుగుతున్నా సాగు విస్తీర్ణం తగ్గుతున్నదని, ప్రస్తుతం ఎరువుల వినియోగం తగ్గిస్తే, ఉత్పాదకత మరింత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను వాడాలని.. ప్రస్తుతమిస్తున్న సబ్సిడీలను తగ్గించి, మిగిలిన నిధుల్లో 50% రాష్ర్టాలకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం దారుణమని విమర్శించారు. చైనా, అమెరికా వంటి దేశాల్లో వ్యవసాయంపై 7 నుంచి 8 శాతం ఖర్చు చేస్తుంటే, భారత్ 2.3 శాతమే ఖర్చు చేస్తున్నదని, దీనికి కూడా కోత పెడితే దిగుబడి తగ్గి రైతులు దివాలా తీస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను దివాలా తీయించి, తమ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్ముకొనేలా కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.