హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 14 మంది అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ.. మరో మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో వారికి మద్దతిస్తామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా విడుదల చేశారు. జర్నలిస్టులకు 300 గజాల స్థలం, రూ.10 వేల పెన్షన్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ నెల 7న తాను పాలేరులో నామినేషన్ వేయనున్నట్టు వెల్లడించారు.
జాబితాను ప్రకటించవద్దంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఫోన్ చేయగా తమ్మినేని వీరభద్రం తిరస్కరించారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టంచేశారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ విధానం తీవ్ర అసంతృప్తికరంగా, అవమానకరరీతిలో ఉన్నదని చెప్పారు.
చర్చల అనంతరం కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరినట్టు సమాచారం. సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానంతోపాటు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో సీపీఎంకు సీటు ఇవ్వాలని సీపీఐ నేతలు కోరగా.. ఈ అంశంపై సీపీఎం కేంద్ర కమిటీతో అధిష్ఠానం చర్చిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పినట్టు సమాచారం. మునుగోడులో స్నేహపూర్వక పోటీ చేయొద్దని సీపీఐ నేతలకు రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై పార్టీలో చర్చిస్తామని సీపీఐ నేతలు స్పష్టంచేశారు.