హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలని కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. ‘ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీని సాగనంపుదాం-దేశాన్ని కాపాడుకుందాం’ అంటూ సీపీఎం, సీపీఐ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో ‘ప్రచార భేరి’ సభ నిర్వహించాయి. ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లకు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న చరిత్ర లేదని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఏనాడూ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడలేదని, వాళ్లు ముస్లింలకు మాత్రమే వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ రాజ్యాంగంపై ప్రమా ణం చేసి, అదే రాజ్యాంగాన్ని వమ్ము చేసి హిందూ రాజ్యం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పార్లమెంటులో ప్రతిపక్షాలు నోరు ఎత్తకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించి భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో అసమానతలు పెరిగిపోయాయని ఆరోపించారు. 2014లో అదానీ ఆస్తి రూ.50 వేల కోట్ల నుంచి 2022 నాటికి రూ.10.50 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. వ్యవసాయ సంక్షోభానికి మోదీ ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని, వైసీపీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రంలో అన్ని ప్రజావ్యతిరేక బిల్లులకు మోదీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.