Sitaram Yechury | వరంగల్ చౌరస్తా : దేశ ప్రజల సంక్షేమాన్ని వీడిన కేంద్ర ప్రభుత్వం( Union Govt ) కార్పొరేట్ శక్తులకు కాపలదారుగా మారిందని సీపీఎం( CPM ) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి( Sitaram Yechury ) ఆరోపించారు. శుక్రవారం వరంగల్ అజాంజాహి మిల్ స్థలంలో ఏర్పాటు చేసిన సీపీఎం పార్టీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో నిర్వహించనున్న జన చైతన్య యాత్రను ఆయన ప్రారంభించి, పాటల సీడీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. నల్లధనాన్ని( Black Money ) వెలికితీసి ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షలు పంపిణీ చేస్తామని చెప్పిన మోదీ( Modi ) ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు పేరుతో ప్రజలను మోసం చేసిందని నిప్పులు చెరిగారు. నల్లదనాన్ని వెలికి తీయడం కోసం పెద్ద నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతున్న బీజేపీ మాటల్లో వాస్తవం లేదన్నారు. కేవలం కార్పొరేట్ సంస్థలు దాచుకోవడానికి వీలుగా రూ. 2 వేల నోట్లను ముద్రించారని పేర్కొన్నారు.
దేశ సంపదను అదానీ( Adani ), అంబానీ( Ambani )కి దోచిపెడుతుందని సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. అదానీ సంస్థల్లో జరుగుతున్న దోపిడీని వెలికితీయడం కోసం ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల కోసం సుమారు రూ. 11 లక్షల కోట్ల అప్పులను రద్దు చేశారని గుర్తు చేశారు. అవే డబ్బులను నిధులకు సరైన విధంగా ఖర్చు చేసి ఉంటే దేశంలో సగం నిరుద్యోగులకు పని కల్పించే పనులు చేసి ఉండవచ్చునని అన్నారు. నోట్ల రద్దు కారణంగా 23 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి బలవంతంగా నెట్టబడ్డారని సీతారాం ఏచూరి తెలిపారు.
దేశం మొత్తం తామే పాలించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈడీ దాడులకు పాల్పడుతుందని సీతారాం ఏచూరి తెలిపారు. బీజేపీయేతర పాలన సాగుతున్న రాష్ర్టాల్లో దాడులు, కేసులు నమోదు చేస్తూ, ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న రాజకీయ పార్టీలు, సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయని వివరించారు. సరైన సాక్ష్యాలు లేకున్నప్పటికీ భయభ్రాంతులకు గురిచేయడం కోసం ఇప్పటికి సుమారు 5500లకు పైగా ఈడీ కేసులు నమోదు చేసిందని సీతారాం ఏచూరి తెలిపారు.