చౌటుప్పల్, జూలై 28 : ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ద్రోహం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారుతున్న రాజగోపాల్రెడ్డి టీఆర్ఎస్పై యుద్ధం చేస్తాననడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.
ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే స్వార్థ రాజకీయాల కోసం ఆయన పార్టీ మారుతున్నాడని విమర్శించారు. డబ్బు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎన్నికల్లో డబ్బు పంచే సంస్కృతిని చంద్రబాబు తీసుకొస్తే.. వైఎస్ రాజశేఖర్రెడ్డి కొనసాగించారని తెలిపారు. ఈడీని వాడుకొని పబ్బం గడుపుకొంటున్న బీజేపీ రాజ్యాంగ సూత్రాలను పూర్తిగా కాలరాస్తున్నదని విమర్శించారు.