తుర్కయాంజాల్, జనవరి 23: మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విశాల ఐక్య సంఘటన ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉన్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఇందుకు ప్రజాఉద్యమాలను బలపర్చడమే ఏకైక మార్గమని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు కొనసాగుతున్నాయి. మొదట అమరవీరుల స్థూపానికి పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు కే హేమలత, ఎస్ పుణ్యవతి, అరుణ్కుమార్, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితోపాటు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నివాళి అర్పించారు. ఢిల్లీ నుంచి వర్చువర్ విధానంలో హాజరైన సీతారాం ఏచూరి ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో ఆరెస్సెస్ ఫాసిస్టు అజెండాను అమలు చేయటమే బీజేపీ లక్ష్యమని తమ పార్టీ ఏనాడో హెచ్చరించిందన్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు శరవేగంగా ధారదత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులు, అధికారాలను హరించి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు బలపడుతున్నాయని చెప్పారు. రాజ్యాంగ సంస్థలైన ఈడీ, ఎన్నికల సంఘంతోపాటు న్యాయ వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నదని దుయ్యబట్టారు. త్వరలో 5 రాష్ర్టాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య కేంద్రం తగువు పెట్టి చూస్తున్నదని సీపీ ఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు ఆరోపించారు. వామపక్షాల ఐక్యతను బలోపేతం చేసుకుంటూనే కమ్యూనిస్టుల పునరేకీకరణ దిశగా అడుగులు వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శిచాడ వెంకట్రెడ్డి ఆకాక్షించారు.