CPM Leader BV Raghavulu | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ): కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమేనని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. 370 సీట్లు గెలుస్తామని బీజేపీ స్పష్టంగా చెప్తోందని, జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కాబట్టి బీజేపీ అలా అంటుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ను విభజించి ముక్కలు చేశామని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుందని, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, విదేశీ సంస్థలకు దేశాన్ని అమ్మడం గొప్ప విజయంగా భావిస్తోందని దుయ్యబట్టారు. గురవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సీపీఎం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ..బీజేపీ రాజ్యాంగానిన ఖూనీ చెయ్యడం కూడా గొప్ప విజయమే అంటుందని విమర్శించారు.
146మంది ఎంపీలను పార్లమెంటు నుంచి గెంటేసి, 19 బిల్లులకు బీజేపీ ఆమోదం తెలిపిందని బీవీ రాఘవులు పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును హరించివేసింది బీజేపీనని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను ఇప్పటికే అణిచివేస్తున్నారని, కొత్తగా మరో యాక్ట్ తెస్తున్నారన్నారు. ఎలక్షన్ కమిషన్లో చాలా లోపాలు ఉన్నాయని, ఈసీ స్వయంప్రతిపత్తిని తీసివేసే కుట్ర చేస్తున్నారని బీవీ రాఘవులు మండిపడ్డారు. బీజేపీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఒక నాటకం అయ్యిందని విమర్శించారు. ఎన్నికల ఖర్చు తగ్గించాలని హిట్లర్ చెప్పిన మాటలను బీజేపీ ఆచరణలో అమలు చేసే కుట్ర చేస్తోందన్నారు. నిరంకుశ, నియంత, అధ్యక్ష తరహా పాలన జరిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.
ప్రపంచం అంతా తిరిగి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, వన్ ఎలక్షన్ను అంబేద్కర్ వ్యతిరేకించారని రాఘవులు గుర్తుచేశారు. అమెరికా లాంటి దేశంలో సమాఖ్య స్పూర్తి ఉందని, అందుకే అభివృద్ధిలో ముందుందని తెలిపారు. ప్రస్తుతం దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని డబ్బు శాసిస్తుందని, ఎన్నికల బాండ్స్ను ఆనాడే సీపీఎం వ్యతిరేకించిందని తెలిపారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అదే విషయాన్ని చెప్పిందని పేర్కొన్నారు .ఎలక్ట్రోరల్ బాండ్స్కు తాము వ్యతిరేకమని, సీపీఎం ఇప్పటికీ బాండ్స్ తీసుకోలేదని చెప్పారు. దేశాన్ని ఎలక్షన్ బజార్గా బీజేపీ చేసిందని రాఘవులు విమర్శించారు.