CPM | హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీపీఎం కలవరపెడుతున్నది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమైన నేపథ్యంలో సీపీఎం రాష్ట్రంలోని 19 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నది. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సీపీఎం పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్ పెద్ద దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గాల్లో సీపీఎం సాధించే ఓట్లు కీలకం కానున్నాయి. పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వయంగా పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఓటమి భయం వెన్నాడుతున్నది.
నల్లగొండ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి పోటీలో ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నకిరేకల్లో సీపీఎం కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంకు ఓటమి తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొత్తంగా కనీసం పది స్థానాల్లో కాంగ్రెస్ను సీపీఎం గట్టి దెబ్బ తీస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉన్నప్పటికీ జలగం వెంకట్రావు పార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తుండటంతో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్రావు మధ్య త్రిముఖ పోరు నడుస్తున్నది.