హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ వీరయ్య బుధవారం మీడియాకు వెల్లడించారు. మిగిలిన 16 స్థానాలకు తర్వాత త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. తొలి విడత ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. తెలంగాణలో 4వ విడతలో ఎన్నికలు జరగనుండగా.. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరాగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీతో దోస్తీ కొనసాగించాలని భావిస్తుండగా.. సీపీఎం మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతున్నది.