Tammineni Veerabhadram | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు తెలపడంపై వీరభద్రం విరుచుకుపడ్డారు.
ఈ దేశాభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేయట్లేదని గతంలో వ్యాఖ్యానించిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నాడని ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇస్తామన్న వాగ్దాదాన్ని మోదీ మరిచిరా? అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడ పోయిందన్నారు. 2022 నాటికి బుల్లెట్ రైలు తీసుకువస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఈ అంశాలపై చంద్రబాబు స్పందించాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
మోదీ పరిపాలనను చూసి బాబు ఆయనకు మద్దతు ఇవ్వడం లేదు. కేవలం తన రాజకీయ అవకాశాల కోసమే మోదీకి మద్దతు ఇస్తున్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని వీరభద్రం ధ్వజమెత్తారు. మోదీ విజన్లో పేదలకు చోటు లేదా..? ఇది మోదీ విజన్ కాదు.. పెట్టుబడిదారుల విజన్. మోదీ, చంద్రబాబుకు విజన్ లేదు.. వారికి విభజన మాత్రమే తెలుసు అని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.