వరంగల్ చౌరస్తా, మార్చి 17: ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు కాపలాదారుగా మారారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్రను వరంగల్ నగరంలో శుక్రవారం ఆయన ప్రారంభించి, పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆజంజాహి మిల్ స్థలంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగించారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు పంచుతానన్న మోదీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలు దాచుకోవడానికే రూ.2000 నోటును ముద్రించారని ఆరోపించారు.
దేశమంటే అంబానీ, అదానీ మాత్రమే అనే విధంగా కేంద్రం వారికి దేశ సంపదను దోచిపెడుతున్నదని ధ్వజమెత్తారు. అదానీ కుంభకోణంపై ఎందుకు విచారించడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల కోసం సుమారు 11 లక్షల కోట్ల అప్పులను రద్దు చేశారని, ఆ మొత్తంతో దేశంలోని సగంమంది నిరుద్యోగులకు పనులు కల్పిస్తే నిరుద్యోగ సమస్య తీరేదని అన్నారు. దేశమంతా తామే పాలించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈడీ దాడులతో బీజేపీయేతర రాష్ర్టాల్లో దాడులతో కేసులు నమోదు చేస్తూ, ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు.
ఇప్పటివరకు సుమారు 5,500కు పైగా ఈడీ కేసులు నమోదు చేసిందని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సొంత ఇండ్లులేని సుమారు లక్షకు పైగా కుటుంబాలకు వెంటనే ప్రభుత్వ భూములను పంపిణీ చేసి పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అవసరమైన సందర్భాల్లో సీపీఐ, సీపీఎం కలిసికట్టుగా ఉద్యమాలు చేపడతాయని అన్నారు. సీపీఎం వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య అధ్యక్షతన జరిగిన సభలో కేంద్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, సీఐటీయూ కార్యదర్శి పాలడుగు భాస్కర్పాల్గొన్నారు.