హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అమలుకాకుండా కేంద్రం ఆటంకాలు సృష్టిస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. తెలంగాణలో గవర్నర్ తమిళిసై వ్యవహారశైలి దారుణంగా ఉన్నదని విమర్శించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తిరస్కరించడం, సవరించాలని చెప్పడం, ఆమోదించక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ఫెడరల్ వ్యవస్థ మీద దాడి తప్ప మరొకటి కాదని, గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిని సైతం ధ్వంసం చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు.
బీజేపీ అప్రజాస్వామిక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 17 నుంచి జనచైతన్య యాత్రలు చేపట్టనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. పది లక్షల కరపత్రాలు, రెండు లక్షల పోస్టర్లు, బుక్లెట్ల ద్వారా ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ నెల 17న వరంగల్లో మొదటి యాత్రను పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారని చెప్పారు. రెండో యాత్ర 23న ఆదిలాబాద్లో బీవీ రాఘవులు, మూడో యాత్రను 24న నిజామాబాద్లో మాజీ ఎంపీ విజయరాఘవన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మూడు యాత్రలు ఈ నెల 29న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్దకు చేరుకుంటాయని పేర్కొన్నారు.