హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయిలో వార్డులు గెలుపొందింది. మిగతా ఏ ఒక్క మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోలేకపోయాయి. ఖమ్మం,నల్లగొండ, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాబల్యం కలిగిన జిల్లాల్లో కూడా వామపక్ష పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం అభ్యర్థులు 132 వార్డుల్లో పోటీ చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 3, అమరచింత 1, ఎదులాపురంలో 2, వనపర్తి 1, నర్సంపేట 1, హుజూర్నగర్ 1, మధిర 1, జనగామ 1 స్థానాల్లో గెలుపొందారు. గత అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసిన సీపీఐ.. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలచింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ఒంటరిగా పోటీచేసిన ఆ పార్టీ 22 స్థానాలను దక్కించుకుంది. వీటితో పాటు క్యాతనపల్లిలో 4, చండూరు 1,హుజూర్నగర్ 1, యాదగిరిగుట్ట 1, ఏదులాపురం 3, వైరా 1, రామగుండం 1 స్థానంలో గెలుపొందింది. 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెంలో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా సీపీఐ 30 డివిజన్లు కోరగా, 20 మాత్రమే ఇచ్చేందుకు అధికార పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. చివరకు 25 డివిజన్లు అయినా ఇవ్వాలని సీపీఐ కోరినా, కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో సీపీఐ ఒంటరిగా బరిలో నిలిచింది. 22 డివిజన్లు గెలుపొందింది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో 9 మంది మద్దతు అవసరమున్నది.