హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): బీజేపీని నిలువరించడానికి మిత్రధర్మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక లోక్సభ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్లోని ముగ్ధూంభవన్లో సీపీఐ జాతీయ కార్యవర్గం సభ్యులు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, పీ పద్మ, ఎన్ బాలమల్లేశ్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము పోటీ చేయడానికి వీలుగా ఉండే ఐదు స్థానాల పేర్లను ప్రకటించి, అందులో ఒకటి ఇవ్వాలని ఇప్పటికే కోరినట్టు కూనంనేని తెలిపారు.