Koonamneni | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్ల నరేంద్రమోదీ పాలనలో తెలంగాణకు, ఖమ్మం జిల్లాకు ఏమి చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటనకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్లో పార్టీ నేతలు అజీజ్పాషా, పల్లా వెంకట్రెడ్డి, బాలమల్లేష్, జలాలుద్దీన్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కమ్యూనిస్టులకు బలం ఉందని కూనంనేని చెప్పారు. కొంతమంది ఏ పార్టీలోకి వెళ్లాలి? ఏం చేయాలి? అనే ధోరణితో ఖమ్మం క్రాస్ రోడ్డులో నిలబడ్డారని, అలాంటి వారిని చేర్చుకునేందుకు కొన్ని పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఖమ్మంకు పెద్ద పెద్ద వలలు తీసుకుని వస్తున్నారని, ఆయన వలలకు చేపలు కాదు కదా..కనీసం పాములు కూడా దొరకవన్నారు.
తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో ఆయన చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. విభజన హామీల ఊసే అమిత్షా ఎత్తడం లేదన్నారు. ఖమ్మంకు వచ్చే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. ఆయన పర్యటనను సీపీఐ వ్యతిరేకిస్తుందన్నారు. ఏ వర్గానికి ప్రయోజనం కలిగిందో చెప్పాలని కూనంనేని ప్రశ్నించారు. అభివృద్ధి కంటే నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు.
బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఆ పార్టీ ఖమ్మంలోనే కాదు.. తెలంగాణలో ఎక్కడా గెలవదని కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసి అధికారంలోకి రావాల్సిన అవసరం తమకు లేదన్నారు. ధరణిలో తలెత్తిన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
సీపీఐ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ‘ బీజేపీ హటావో..దేశ్కీ బచావో’ పేరుతో చేపట్టిన ఇంటింటికీ సీపీఐ, ప్రజాగర్జన పేరుతో రాష్ట్ర పార్టీ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని కూనంనేని చెప్పారు. కొత్తగూడెంలో జరిగిన సభ విజయవంతమైందని, ఇందుకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.