ఖమ్మం : ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరుపుతున్నట్లుగా లేదన్నారు. విచారణ నిష్పక్షపాతంగా విచారణ చేయాలని, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం విఫలమైన తర్వాత ఈడీ, సీఐబీ విచారణ తీవ్రత పెంచారని ఆరోపించారు. బండి సంజయ్ వ్యాఖ్యానాలు నిస్సిగ్గుగా ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేతలను బెదిరించి బీజేపీలోకి వలసలకు ప్రోత్సహిస్తున్నట్లుగా బీజేపీ చర్యలున్నాయని విమర్శించారు.
టీఆర్ఎస్లో ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ తమ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం కనపడుతుందని ఆరోపించారు. సీబీఐ రావాలంటే రాష్ట్రం అనుమతి తీసుకోవాల్సి ఉందని, అనుమతి తీసుకోకుండానే ఎలా విచారణ జరుపుతారని ప్రశ్నించారు. అన్ని రాజ్యాంగ సంస్థలను లను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీకి చెందిన వారిపై ఇప్పటి వరకు ఈడీ దాడులు ఎన్ని జరిగాయని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్లో ఆప్, ఎంఐఎంను అడ్డం పెట్టుకుని గెలిచారని, బీజేపీ పతనం ప్రారంభమైందని కూనంనేని ధ్వజమెత్తారు.