హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ముగ్దూంభవన్లో రెండురోజులపాటు జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. కూనంనేని మాట్లాడుతూ సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బండి సంజయ్పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘బీజేపీ హటావో.. దేశ్కో బచావో’ నినాదంతో అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 నుంచి ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమానికి తమ పార్టీ శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నెలపాటు పాదయాత్రలు, బైక్ యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్లో రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేపడుతామని, ముగింపు రోజు హైదరాబాద్లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు. 25న విభజన హామీలపై బయ్యారం నుంచి పాదయాత్ర చేపడతామని, పాదయాత్ర ఏప్రిల్ 25న హన్మకొండలో బహిరంగసభతో ముగుస్తుందని వివరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, బాల నర్సింహ, తకెల్లపల్లి శ్రీనివాసరావు, పశ్య పద్మ పాల్గొన్నారు.