హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలో మోసగాళ్లు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారని.. డబ్బు ఉంటే ఎలాగైనా గెలవొచ్చనే ధీమాతో మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. ఈ ఉపఎన్నికలో బీజేపీని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని మగ్దూం భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన రాజగోపాల్రెడ్డి ప్రజలను మోసం చేశారని, తమ్ముడికి ఓటేయాలని చెబుతున్న కాంగ్రెస్ ఎంపీ వెంకట్రెడ్డిది ఏమి నైతికత అని ప్రశ్నించారు. బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళం విప్పిన నేత సీఎం కేసీఆర్ అని, అందుకే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించామన్నారు. పల్లా వెంకట్రెడ్డి నేతృత్వంలో మునుగోడులో కమ్యూనిస్టులు కూసుకుంట్లకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఫిరాయింపులు, డబ్బును నిరోధించడంలో ఎన్నికల సంఘం విఫలమైనదని విమర్శించారు. ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, సీబీఐ వంటి రాజ్యాంగ వ్యవస్థలను మోదీ సర్కారు ధ్వంసం చేసిందని ఆయన దుయ్యబట్టారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్పాషా, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, పశ్య పద్మ, బాలమల్లేశ్, నర్సింహ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.