హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకగా మారిన సీబీఐని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు. ఈ కేసులో నంబర్ 2గా చెప్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా పాత్రపైనా పోలీసులు విచారణ చేపట్టాలన్నారు. కమ్యూనిస్టులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ రాజకీయ అజ్ఞాని అని మం డిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, పశ్య పద్మ, ఈటీ నరసింహా తో కలిసి హైదరాబాద్ మగ్ధుంభవన్లో సోమవారం కూనంనేని మాట్లాడారు. రూపాయి ఖర్చు పెట్టకుండా రానున్న ఎన్నికల్లో పాల్గొంటామని బీజేపీ ప్రమాణం చేయగలదా? అని సవాల్ విసిరారు.
బండికి ప్రమాణాలపైనే మోజు ఎకువ అని.. చట్టాలు, వ్యవస్థలపైన ఆయనకు గౌరవం లేదని విమర్శించారు. 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని, ఇందులో తమ తప్పులేదని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాతో ప్రమాణం చేయిస్తారా? అని బండిని ప్రశ్నించారు. బీజేపీ చేసే తప్పడు పనులను సీఎం కేసీఆర్ ధైర్యంగా ప్రశ్నిస్తున్నారని.. బీజేపీని ఓడించే, ప్రగతిశీల పార్టీలతో తాము కలుస్తామన్నారు. సీబీఐ, ఈడీ నోటీసులు అందుకున్న సీఎం రమేశ్, సుజనా చౌదరీలు బీజేపీలో చేరగానే పునీతులయ్యారని, బీజేపీ ఒక పెద్ద వాషింగ్ మిషన్ అని ఎద్దేవాచేశారు. బీజేపీ తనతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీని మునుగోడులో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.