హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష నేతలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వరుస దాడులను ఆపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా డిమాండ్ చేశారు. కేంద్ర చర్యలను నిరసిస్తూ శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేయడం, ప్రతిపక్ష కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. లోకసభ ఎన్నికల ముంగిట ప్రధాని మోదీ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్నారని, వాటి గొంతులను నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను బీజేపీ విచ్చలవిడిగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. దేశంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగేందుకు కేంద్రం విఘాతం కలిగిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ బాల మల్లేశ్, పశ్య పద్మ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నరసింహారావు, మల్లు లక్ష్మి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.