హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సిద్ధాంతమా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తిని ప్రధాని మోదీ ధ్వంసం చేయాలనుకొంటున్నారా? అని మండిపడ్డారు. హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విచ్చలవిడిగా ఈడీని ఉసిగొల్పడమే బీజేపీ తీర్మానమా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ పార్టీ ఉంటే, రాష్ర్టాల్లో అదే పార్టీ అధికారంలో ఉండాలని ఎకడా లేదని అన్నారు. మహారాష్ట్ర రాజకీయాలను కేంద్రం పట్టించుకోవాల్సిన అవసరం ఏం ఉన్నదని నిలదీశారు. శివసేన ప్రభుత్వంతో బీజేపీకి ఏం పని అని అడిగారు.
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తామని మ్యానిఫెస్టోలో బీజేపీ పెట్టిందా? అని ధ్వజమెత్తారు. ఎనిమిదేండ్లలో మోదీ ప్రభుత్వం ఒక పబ్లిక్ సెక్టార్ను కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. దేశంలో బలహీన ప్రధానులు ఉన్నా, పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ఏర్పాటు చేశారని, మోదీ వచ్చాక ఇప్పటి వరకు 24 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని వెల్లడించారు. బ్యాంకుల్లో 28 మంది రూ.20 లక్షల కోట్లు కొల్లగొట్టి పారిపోయారని వివరించారు. వారిలో విజయ్ మాల్యా తప్ప మిగిలిన 27 మంది గుజరాతీలే ఉన్నారని తెలిపారు. యూపీఏ హయాంలో సొంత పార్టీ నేతలు కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. మోదీ ప్రధాని అయ్యాక రూ.85 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని చెప్పారు.
నోట్ల రద్దుతో పేద ప్రజలే నష్టపోయారని, ఈ దందాలో రూ.2.5 లక్షల కోట్లు కమీషన్ రూపంలో బీజేపీకి వెళ్లిందని ఆరోపించారు. మేకప్ కోసం నెలకు రూ.75 లక్షలు ఖర్చు పెట్టే ప్రధానిని, ఒక రోజులో 14 డ్రెస్సులు మార్చే పీఎంను ఇంత వరకు ఎప్పుడైనా చూశామా! అని ప్రశ్నించారు. దేశ సంపదను దోపిడీ చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని నారాయణ మండిపడ్డారు. అటు.. ఎయిర్పోర్ట్ నుంచి ఎవరో బీజేపీ నాయకులు వస్తున్నారని, వాళ్లు విమానం దిగకముందు నుంచే శంషాబాద్లో వాహనాలను బ్లాక్ చేయడం దారుణమని పేర్కొన్నారు. హింసిస్తున్న బీజేపీని చూసి హైదరాబాద్ జనాలు అసహ్యించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. శంషాబాద్లో వాహనాల నిలిపిన వీడియోను ఆయన విడుదల చేశారు.