హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సీపీఐతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల మెజారిటీకి సీపీఐ ఓట్లు ఉపయోగపడ్డాయని చెప్పారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని, దీన్ని జాతీయ నాయకత్వం గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. సోమవారం మగ్ధూంభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఒంటెద్దు పోకడల వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్లోని ఎంపీ సీట్లలో పోటీచేస్తామని నారాయణ వెల్లడించారు. తెలంగాణ, ఏపీలో ఒక్కోచోట పోటీ చేస్తామని చెప్పారు. బతికుండగానే ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సమాధి కట్టుకొంటున్నారని విమర్శించారు. ఏపీలో కూడా అధికార మార్పిడి ఖాయమని అన్నారు. నిపుణులు, అనుభవం ఉన్నదనే పేరుతో రిటైర్డ్ అధికారులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవద్దని సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, ఆటోవాలాలకు న్యాయం చేసేలా నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందించాలని కోరారు. పార్లమెంటుపై దాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిపై ఉపా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.