హైదరాబాద్: కాంగ్రెస్ నాయకత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో సీపీఐ భాగంగానే ఉందని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశామని గుర్తుచేశాయి. అయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలంగాణలో తమకు ఒక్క ఎంపీ సీటుకుడా ఇచ్చేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వారికి కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేవారిని కూడా కలుపుకుపోవడం లేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తాము కాంగ్రెస్ పార్టీని ఎంపీ సీట్లు అడుగుతున్నామని, పోటీ చేయాలనుకుంటున్న సీట్ల వివరాలు కూడా వారికి ఇచ్చామని చెప్పారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు దాటాయంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతకనియ్యరని తెలిపారు. ఇండియా కూటమిలో ఉండటంతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు చేశారన్నారు.