హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కొత్త రేషన్కార్డులు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికుల బతుకు దుర్భరంగా మారిందని, వారిని ఆదుకోవాలని సూచించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం పదేండ్లుగా రావాల్సిన నిధులను రాబట్టడం కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు దాదాపు రూ.70 వేలకోట్లు ఉంటాయని, వాటిని తీసుకొస్తే రాష్ర్టానికి ఉపయోగపడతాయని చెప్పారు.
ప్రతి జిల్లాలో ఐటీ హబ్లు ఏర్పాటుచేయాలని, అసంఘటిత రంగాల వారికి పింఛన్ ఇవ్వాలని సూచించారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఏదైనా చేయాలనుకుంటే చేసేస్తారని, వద్దనుకుంటే మాత్రం ఎవరు చెప్పినా చేయరని అన్నారు. వ్యక్తిగత దూషణలు సరికాదని, సభను హుందాగా నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వందశాతం అమలు చేయాలని చెప్పారు. ఒకవేళ అమలు చేయలేకపోతే, ఎందుకు చేయలేకపోయామో? బాధ్యతాయుతంగా ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో చేసిన మంచి పనులు, పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. ఈ సభలో ఎవరూ శాశ్వతం కాదని, ఓడిపోయామని బీఆర్ఎస్ బాధ పడాల్సిన పనిలేదని, నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర స్ఫూర్తిదాయకమని, అప్పట్లో కేసీఆర్ను ఖమ్మం జైలులో పెడితే తామంతా వెళ్లి మద్దతు తెలిపామని గుర్తుచేశారు. తెలంగాణ సుసంపన్న రాష్ట్రమని, ఆ నిధులతో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని పేర్కొన్నారు.