సుల్తాన్బజార్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన పేరుతో బీజేపీ చేస్తున్న హంగామా చూస్తుంటే ఊళ్లో పెండ్లికి కుక్కల హడావుడిలా ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74వ వారోత్సవాల బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు పోరాటం చేసింది కమ్యూనిస్టులైతే ఆ పోరాటంలో లేని బీజేపీ ప్రస్తుతం ఉత్సవాల పేరిట హంగామా చేస్తున్నదని అన్నారు. నాడు నిజాం సర్కార్ ఇతర భూస్వాములు చేస్తున్న దురాగతాలను చూసి భయపడి ఆర్ఎస్ఎస్ వాళ్లు కలుగుల్లో ఎలుకల్లా దాక్కున్నారని విమర్శించారు.
ఆర్ఎస్ఎస్ అనుబంధ బీజేపీ నేడు ఆ పోరాట ఉత్సవాలను జరుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టులు లేకుండా జరిగిందా? అని సూటిగా నిలదీశారు. నిజాం నవాబుతో యథాతథ ఒడంబడిక చేసుకొన్న పటేల్ తెలంగాణను విముక్తి చేశాడా? అని ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీ వాళ్లు వీరుడని కీర్తించే సావర్కర్ తెలంగాణకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కర్ణాటక పాఠ్య పుస్తకాలలో జైలు నుండి సావర్కర్ పక్షి రెక్కల మీద వెళ్లి ప్రజలతో సంభాషించి తిరిగి వచ్చేవాడని ఉందని ఆయన తెలిపారు. ఆ వీరుడు కనీసం రైలు మీదనైనా తెలంగాణకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా కనీసం పత్రికా ప్రకటనైనా ఎందుకు ఇవ్వలేదని అన్నారు. మోదీ మిత్రుడు అదానీ నాటి నిజాంలాగా ప్రపంచ కుబేరుడు అవుతున్నాడని అన్నారు.
ఉగ్రవాదుల కంటే మోదీ ప్రమాదకరం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ విలీనం సందర్భంగా ఉత్సవాలు జరుపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటి స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీకి చెందిన ఒక్క పోరాట యోధుని పేరైనా చెప్తారా? అని సవాల్ విసిరారు. తెలంగాణ సాయుధ పోరాటంపై కమ్యూనిస్టులు ఉత్సవాలు జరుపుకొంటుంటే మరోవైపు కాకులు (ఇతర పార్టీలు) కేకలు పెడుతున్నాయని అన్నారు. ఉగ్రవాదుల కంటే మోదీ ప్రమాదకరమని, రాజ్యాంగానికి శత్రువని విమర్శించారు. సీపీఐ రా్రష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. పచ్చని తెలంగాణలో నిప్పు పెట్టేందుకే అమిత్షా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మతం చిచ్చు రేపుతున్న అమిత్ షా వంటి చీడపురుగు గుజరాత్లో ఉండవద్దని అక్కడి కోర్టు బహిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నర్సింహా, ప్రొఫెసర్ కాశిం, ఎంకే మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.