హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఫాసిస్ట్, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్గడరీ, శివరాజ్ చౌహాన్లను తప్పించారని, 2024 ఎన్నికలకు ముందే బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు ఉండబోతున్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని కామ్రేడ్ గుండా మల్లేశ్ ప్రాంగణం (మల్లికా కన్వెన్షన్ సెంటర్)లో అతుల్కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నప్పటికీ బయట కనిపించడం లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలతోపాటు ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకంకావాలని పేర్కొన్నారు. కేసీఆర్, నితీశ్కుమార్, అశోక్ గెహ్లాట్ వంటి నేతలు కలవాలని సూచించారు. సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత బిబోయ్ విశ్వం మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. దేశంలో మతోన్మాద, ఫాసిస్ట్ ప్రమాదం పొంచి ఉన్నందున వామపక్షాలు, ప్రజాతంత్ర, లౌకిక శక్తులన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వజ్రోత్సవ వేడుకల్లో కమ్యూనిస్టులనూ భాగస్వాములను చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి బాల్కాంగో, జాతీయ కార్యవర్గ సభ్యు డు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు.