యాదాద్రి, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పడం కాదు.. ఎంఎస్పీ చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం జరిగిన పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. ఎఫ్సీఐ వడ్ల కొనుగోలుపై స్పష్టమైన వైఖరి చెప్పాలన్నారు. పార్లమెంటులో ఓవైపు టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం ప్రతి గింజనూ కొంటామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన ప్రకటన చేయడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఉక్కు వంటి పెద్ద పెద్ద ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్నారు. రైల్వే, రక్షణ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తున్నదని మండిపడ్డారు.