పెద్దపల్లి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ.. దేశాన్ని అంబానీ, ఆదానీలకు దారదత్తం చేస్తున్నాడని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిపోతున్నాయని దీంతో సామాన్య ప్రజలపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరీతంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. రూ.72 లక్షల కోట్ల నల్ల ధనాన్ని తీసుకవచ్చి పేద కుటుంబాలకు రూ.15 లక్షలు ఖాతాల్లో వేస్తామని చెప్పి నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు.