హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీకి ఉన్న ప్రేమ బూటమకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని ప్రైవేటీకరించే చర్యలపై తెలంగాణ బీజేపీ నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ యంత్ర సామగ్రిని తుక్కుగా అమ్మేందుకు టెండర్లు పిలవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు ముందుకు వచ్చినా, కేంద్రం పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించి, వెనుకబడిన ఆదివాసీలు ఉండే జిల్లాలో ఉద్యోగాల కల్పనకు, అభివృద్ధికి బాటలు వేయకపోవడం దారుణమన్నారు.
ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీని గెలిపించిన ప్రజలపై కేంద్రం కక్షగట్టడం దారుణమని చాడా వెంకట్ రెడ్డి అన్నారు . నీళ్లు, నిధులు, నియామకాలు బీజేపీతోనే సాధ్యమన్న కేంద్ర మంత్రి అమిత్షా.. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలో తీసుకొని తెలంగాణ నీటిని, నిధులు, రుణాలను అడ్డుకుంటుంన్నారని మండిపడ్డారు. సిమెంట్ ప్యాక్టరీని విక్రయించడం ద్వారా నియామకాలను ప్రజలకు దూరం చేస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు చిత్తశుధ్ది ఉంటే తక్షణమే ఆదిలాబాద్ సిమెంట్ ప్యాక్టరీ సామగ్రి వేలం ప్రక్రియను నిలిపి వేయించి, పరిశ్రమను పునరుద్ధరించాలని చాడ డిమాండ్ చేశారు.